చంద్రబాబును మరోసారి టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ ఉరఫ్ ఆర్జీవీ.. ఈయనకు సినిమాలు చేయడమే కాదు సెటైర్లు వేయడం కూడా బాగా వచ్చు. ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడును ఆయన తెలుగుదేశం పార్టీని నేరుగానే ఏకి పారేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జగన్ గెలిచిన తర్వాత అసలు ఈయన ఎవరి మాటా వినడం లేదు. ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సంచలన సినిమా తెరకెక్కించాడు వర్మ. ఇందులో పూర్తిగా చంద్రబాబును విలన్ గా మార్చేసాడు. ఆయన ఓటమి కోసమే సినిమా తీసినట్లుంది లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇదిలా ఉంటే ఎన్నికల్లో బాబు ఓడిన తర్వాత కూడా వరసగా ఆయన్నే టార్గెట్ చేస్తూ వస్తున్నాడు ఆర్జీవీ. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసాడు వర్మ. తాజాగా తన ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈ దర్శకుడు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి పుట్టుకను ఇస్తే.. చంద్రబాబు దాన్ని చంపేస్తున్నాడంటూ స్టేట్మెంట్ పోస్ట్ చేసాడు వర్మ. ఇది చూసిన తర్వాత బాబు ఫ్యాన్స్ వర్మపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఓడినంత మాత్రానా పార్టీ పరువు పోలేదు.. ఉనికి పోలేదంటూ వర్మకు ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. తాజాగా తెలుగుదేశం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బిజేపీలోకి వెళ్లడంపై పెద్ద దుమారమే జరుగుతుంది. దాంతో పాటు తెలుగుదేశంలో ముసలం కూడా మొదలైపోయిందనే వాదన వినిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఇదే అదునుగా చంద్రబాబును మరోసారి లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నాడు వర్మ. మొత్తానికి ఈయన మాటలు ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్నాయి.