రవితేజ - గోపీచంద్ సినిమా మొదలయ్యేదప్పుడే

కొద్ది రోజులుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం `డిస్కోరాజా` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల కాకముందే తన తర్వాతి సినిమాను రవితేజ పట్టాలక్కించబోతున్నాడు. ఇంతకు ముందు తనతో `డాన్ శీను`, `బలుపు` సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ ఫోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ స్టార్ విజయ్ నటించిన బ్లాక్బస్టర్ తేరీకి ఈ సినిమా రీమేక్ అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు గోపీచంద్ స్పందించాడు. `ఇది ఏ సినిమాకూ రీమేక్ కాదు. వాస్తవ ఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ` అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 14న పూజాదికాలతో మొదలు పెట్టనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్కుమార్ నటిస్తున్నారని సినిమా యూనిట్ ప్రకటించింది. ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా సమ్మర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.