పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా టైటిల్ ఏంటో తెలుసా..

పవన్ సినిమాలు చేయాలని మరింత ఒత్తిడి పెరిగిపోతుంది. రాజకీయాల కోసం విపరీతంగా గడ్డం పెంచిన పవన్.. ఆ మధ్య మళ్లీ హీరోలా మారిపోయాడు. కొత్త లుక్ లో తానా మహాసభలలో కనిపించాడు. అప్పట్నుంచి ఈయన మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నిర్మాతలు అయితే ఈయన కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో పాటు పవన్ స్నేహితుడు రామ్ తాళ్ళూరి, ఏ.ఎమ్. రత్నం లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు పవన్ అనుమతి కోసం చూస్తున్నారు. 2024 ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉందని.. ఆ లోపు కనీసం రెండు సినిమాలు అయినా చేయాలంటూ కోరుకుంటున్నారు.
ఇప్పుడు పవన్ కూడా ఈ విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మూడేళ్ల పాటు ఏడాదికో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా పవన్ ముందుకు వచ్చిందని.. దాని వైపు ఆయన ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన దిల్ రాజు బోనికపూర్ కలిసి పింక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ మొన్న కూడా పవన్ తనకు సినిమాలు చేయడానికి ఆసక్తి లేదని చెప్పాడు.
కొంతకాలం తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ప్రశాంతంగా ఉంటానని చెబుతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ మళ్లీ మేకప్ వేసుకునే టైమ్ దగ్గరికి వచ్చేసింది. డిసెంబర్ నుంచి ఈయన సినిమా మొదలు కానుందని తెలుస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు పవర్ స్టార్. దీనికోసం కథ కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే వేణు దీనికోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.
హిందీలో అమితాబ్.. తమిళ్ లో అజిత్ నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడు. తెలుగులో దీనికి లాయర్ సాబ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. డిసెంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ కోర్టు నిర్మాణం జరుగుతుంది. పూజ హెగ్డే సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించబోతుంది.