ఆ దర్శకుడిని చెప్పుతో కొట్టాలన్న వాసిరెడ్డి పద్మ

సెల్ఫోన్ల వల్ల ఆడవాళ్లు చెడిపోతున్నారా? కట్టుబాట్లు వదిలేస్తున్నారా? వివాహేతర సంబంధాల కోసం భర్త, పిల్లల్ని మహిళలు చంపేస్తున్నారా? అవుననే అంటున్నారు తమిళ నటుడు, దర్శకుడు భాగ్యరాజా. కరుత్తుగలై పుదిఉసెయ్ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఆడవాళ్లు చెడిపోవడానికి సెల్ఫోన్లు కారణమని, కట్టుబాట్లు వదిలేస్తున్నారని వ్యాఖ్యానించారు భాగ్యరాజా. మహిళలు చనువు ఇవ్వడం వల్లే.. పురుషులు తప్పు చేస్తున్నారని కూడా భాగ్యరాజా విమర్శలు చేశారు. వివాహేతర సంబంధం కోసం భర్త, పిల్లల్ని మహిళలు చంపేస్తున్నారని కామెంట్ చేశారాయన. పొలాచ్చి రేప్ విషయంలో మగాళ్లది తప్పులేదని అన్నారు. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టే రేప్ జరిగిందని భాగ్యరాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. భాగ్యరాజాపై మహిళలు, మహిళా సంఘాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. తాజాగా ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్,వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. భాగ్యరాజా వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని అలాంటి దర్శకుడిని చెప్పుతో కొట్టాలని ఘాటుగా స్పందించారు. మహిళలకు వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వానికి కూడా తాను లేఖ రాస్తానని తెలిపారు.