బాలయ్యను దిష్టిబొమ్మ అంటున్న రామ్ గోపాల్ వర్మ..

వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇది నిజం. మరోసారి రామ్ గోపాల్ వర్మ తన చేతికి పని చెప్పాడు. ట్విట్టర్లో కావాలని బాలకృష్ణ టార్గెట్ చేశాడు. ఇప్పటికే చాలాసార్లు తెలుగుదేశంపై తన నోటి దురుసు చూపించిన వర్మ.. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా శాసనమండలిలో రోజా బాలకృష్ణ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై తనదైన శైలిలో పంచ్ వేశాడు వర్మ.
ఎలాగైనా 3 రాజధానుల బిల్లును ఆమోదించుకోవాలని వైసీపీ పట్టుబట్టిన సమయంలో అది కుదరలేదు. చివరికి శాసనమండలి చైర్మన్ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాడు. అయితే ఇదంతా ఇలా ఉంటే శాసనమండలి గ్యాలరీలో బాలకృష్ణ, రోజా చేసిన సందడి మరో ఎత్తు. సభ వాయిదా పడటంతో గ్యాలరీలోనే చంద్రబాబు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు వేచి ఉన్నారు. యాదృచ్చికంగా ఒకే గ్యాలరీలో ఉన్న రోజా బాలకృష్ణ కెమెరాకు చిక్కారు. అక్కడితో ఊరికే ఉండకుండా పక్కనే ఉన్న బాలకృష్ణతో ఒక సెల్ఫీ దిగింది రోజా. ఈ సెల్ఫీలో బాలకృష్ణ చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ తర్వాత బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అడిగిమరీ సెల్ఫీలు దిగారు.
ప్రస్తుతం ఈ సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోను పోస్ట్ చేసి ఇందులో రోజా గారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆ పక్కన కుడి వైపు ఉన్నది ఎవరో తెలియడం లేదు.. చాలా నీచంగా ఉన్నాడు.. అతను దిష్టిబొమ్మ కావచ్చు అంటూ ట్వీట్ చేశాడు వర్మ. ఇది చూసిన తర్వాత బాలకృష్ణ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నావు.. కావాలనే బాలయ్యను ఎందుకు రెచ్చగొడుతున్నావు.. అది నీకే మంచిది కాదు అంటూ వర్మకు వార్నింగ్ ఇస్తున్నారు అభిమానులు. ఏదేమైనా కూడా వర్మ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.