కొత్త అవతారం ఎత్తిన రెహ్మాన్

మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం 99 సాంగ్స్తో మరోకొత్త అవతారంలో పరిచయం కాబోతున్నారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహ్మాన్. జియో స్టూడియోస్తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్న రెహ్మాన్ నిర్మాత, రచయితగానూ వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈచిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఏఆర్ రెహ్మాన్.. దేశఖ్యాతిని అంతర్జాతీయంగా ఇనుమడింపజేసిన సంగీతదర్శకుడు. చయ్య చయ్య అని మెస్మరైజ్ చేసినా..జయహో అంటూ స్ఫూర్తినింపినా అది రెహ్మాన్కే చెల్లింది. ఆయన సంగీతదర్శకత్వంలో మేలిముత్యాల్లాంటి పాటలు జాలువారాయి. ఇప్పుడు ఆయన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం '99 సాంగ్స్'తో మరో కొత్త అవతారంలో పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత, రచయితగానూ వ్యవహరిస్తున్నారు.
కొత్త బాధ్యతల నిర్వహణ సవాలుగా ఉందని ఆయన చెబుతున్నారు. ఒక చిత్రానికి సంగీతం మాత్రమే సమకూరుస్తున్నపుడు ఆలోచనలను పంచుకోవడానికి అనుభవం ఉన్న దర్శకుడు, పాటల రచయిత, నిర్మాత వంటి వారు ఉంటారు. ఈ చిత్రంలో రచయిత, నిర్మాత తానే కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చిందని అంటున్నారు. అందుకే ప్రతి పాటను మూడు నుంచి నాలుగు వెర్షన్లలో తెరకెక్కించినట్లు తెలిపారు. మూడు నెలల క్రితం వరకు పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఈ చిత్రాన్ని అంబానీకి చెందిన జియో స్టూడియోస్తో కలిసి నిర్మిస్తున్నట్లు రెహ్మాన్ తెలిపారు. 99 సాంగ్స్ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు. హీరో హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్ భట్, ఎడిల్సే వర్గాస్లు పరిచయం కానున్నారు. వీరితో పాటు సీనియర్ నటీమణులు మనీషా కొయిరాలా, లిసా రే కూడా 99 సాంగ్స్ చిత్రంలో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈ చిత్రం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది