తెలుగు ఇండస్ట్రీకి క్లాస్ పీకిన మెగాస్టార్ చిరంజీవి..

ఎప్పుడు స్టేజీపై చాలా సరదాగా కనిపించే చిరంజీవి ఈసారి మాత్రం కాస్త సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులను చూసి ఆయన ఒక్కసారిగా మనసులో ఉన్న మాటను చెప్పేశాడు. ఒకప్పుడు ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అలా ఉండటం లేదు అంటూ ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా ఈ తరం నటీనటులు సమయానికి విలువ ఇవ్వడం లేదు అంటూ ఆయన నీతులు చెప్పాడు. గంటలకొద్దీ కార్వాన్ లో ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం అంటూ చిరంజీవి ప్రశ్నించాడు. హీరో అనేవాడు షూటింగ్ లొకేషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందని.. దర్శకుడు నిర్మాత కూడా చాలా జాగ్రత్తగా ఉంటారని చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తమకు కార్వాన్ అంటే ఏంటో తెలియదు.. ఇప్పుడు కూడా తాను కేవలం మేకప్ కోసం బట్టలు మార్చుకోవడం కోసం మాత్రమే కార్వాన్ యూజ్ చేస్తానని చెప్పాడు మెగాస్టార్. కానీ ఇప్పుడు మాత్రం గంటల తరబడి అందులోనే ఉంటున్నారని.. అసలు షూటింగ్ లొకేషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ తరం హీరోలు ఇంకా చాలా నేర్చుకోవాలని సూచించాడు మెగాస్టార్. ఇంత పెద్ద సినిమా అయినా వంద రోజుల కంటే లోపు పూర్తి చేస్తే నిర్మాతలకు నష్టం అనేది ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి.
ఈయన మాట తీరు చూస్తుంటే ఇప్పుడు మరో దాసరి నారాయణరావు కనిపిస్తున్నాడు. ఎందుకంటే మొన్న జరిగిన ఇండస్ట్రీ పెద్దల మీటింగ్ లో అధ్యక్షుడు చిరంజీవే. ఇంకా చెప్పాలంటే ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందే మెగాస్టార్. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూలంకశంగా మాట్లాడటానికే చిరు ఇది ఏర్పాటు చేసాడు. ఒకప్పుడు దాసరి ఇలా చేసేవారు. దాసరి అనే పేరులోనే పెద్దరికం ఉంది. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ముందుగా అంతా తట్టేతలుపు దాసరి నారాయణరావు. అర్ధరాత్రి వెళ్లి సమస్య చెప్పినా.. దాన్ని పరిష్కరించే వరకు దాసరి తపించేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. ఆయన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. దాసరి తర్వాత సురేష్ బాబు ఆ స్థానం కోసం పోటీ పడ్డారనే ప్రచారం జరిగినా.. ఆయన వైపు ఇండస్ట్రీ పెద్దలు పెద్దగా మొగ్గు చూపలేదు. దాంతో సురేష్ బాబు మధ్యలోనే ఆగిపోయారు. అల్లు అరవింద్ ఉన్నా తన విషయాలను మాత్రమే పట్టించుకుంటున్నారు.
దాంతో దాసరి వదిలివెళ్లిన పెద్దమనిషి కుర్చీ అలాగే ఉండిపోయింది. ఇండస్ట్రీలో తర్వాతి దాసరిగా మారిపోతున్నాడు చిరంజీవి. అవును.. ఇది నమ్మడానికి కాస్త కొత్తగా అనిపిస్తున్నా ఇదే నిజం. చిరుని ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా భావిస్తున్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా మెగాస్టార్ ఇంటి తలుపు తడుతున్నారు. అలాగే చాలా మంది చిరంజీవితో మునపటి వైరం మరిచిపోయి మరీ ఆయనతో కలుపుగోలుగా ఉంటున్నారు. రాజశేఖర్ దంపతులే దీనికి నిదర్శనం. అంతేకాదు.. చిరంజీవి ఇకపై సినిమాలకే పూర్తి సమయం కేటాయించబోతున్నారు. అంటే ముందులా ఆయనకు ఇప్పుడు రాజకీయాలు కూడా లేవు. దాంతో అందరి సమస్యలు తీర్చే పెద్దదిక్కుగా మారడానికి కావాల్సినంత టైమ్ కూడా ఉంది. అయితే దాసరి ప్లేస్ లోకి చిరు వస్తారని భావిస్తున్నా.. చిన్న సినిమాలకు ఆయనిచ్చే భరోసా ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ మధ్య ప్రతీ సినిమా వేడుకలో కూడా చిరు కనిపిస్తున్నాడు. చిన్న సినిమాలకు కూడా ఆయన బాసటగా నిలుస్తున్నారు.
ఇప్పుడు కూడా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా నటిస్తున్న ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చాడు మెగాస్టార్. అక్కడే హీరో హీరోయిన్లకు క్లాస్ తీసుకున్నాడు చిరంజీవి. ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు తాను అండగా నిలుస్తారని భరోసా ఇచ్చాడు మెగాస్టార్. ఇదే విషయంపై మొన్న తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ తో మాట్లాడమని చెప్పాడు. ఇప్పటినుంచి ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు సరైన థియేటర్లు వచ్చేలా తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఏదేమైనా కూడా దాసరి మరణించిన తర్వాత ఇప్పుడు ఆ స్థానంలోకి రావాలని చూస్తున్నాడు చిరంజీవి.