ఆఫీస్ లేదు ఇంటికెళ్లిపోండి.. స్టాఫ్కు పూరీ ఛార్మి బంపర్ ఆఫర్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా కరోనా మాటే.. ఈ మహమ్మారికి భయపడి అంతా ఆఫీసులకు తాళాలు కూడా వేసుకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని ప్రభుత్వం కూడా ఆజ్ఞలు జారీ చేసింది. దాంతో అంతా ఇంటికే పరిమితం అయిపోయాయి. కొన్ని కార్పోరేట్ ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా ఇచ్చేసాయి. ఈ నేపథ్యంలోనే పూరీ కనెక్ట్స్(పీసీ) సంస్థ కూడా తమ ఆఫీసులకు తాళం వేసింది. #CoronavirusOutbreak అంటూ తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసింది ఈ సంస్థ. పీసీ బ్యానర్లో అడ్మినిస్ట్రేషన్, ప్రొడక్షన్ వర్క్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ సిబ్బంది, నటీనటుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది ఈమె. పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే మళ్లీ ఓపెన్ చేస్తామంటూ ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది పూరీ కనెక్ట్స్. కరోనాపై యుద్ధంలో గెలవాలంటే సమిష్టిగా పోరాడాలంటూ పూరీ, చార్మీ అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు రేగుతున్న వేళ కరోనా వైరస్పై గెలవాలంటే ప్రభుత్వ సూచనలను పాటించాలని వాళ్లు సూచించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా ఫైటర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరీ. సొంత బ్యానర్లోనే ఈ సినిమాను పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నాడు.