రంగమ్మత్తను పుష్ప నుంచి తప్పించేసారా..?

ఏమో ప్రస్తుతం ఇవే వార్తలు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరూ కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కూడా వినిపిస్తున్న సమాచారం బట్టి ఇది నిజమే అని తెలుస్తుంది. పైగా రంగస్థలంలో అనసూయ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అనసూయను అంత ఈజీగా సుకుమార్ మాత్రం ఎందుకు వదులుకుంటాడులే అనేవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. పైగా బుల్లితెరను తన అందాలతో మత్తుగా తడిపేస్తూనే వెండితెరపై కూడా దండయాత్ర చేస్తుంది అనసూయ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. వయసు ఉండగానే హీరోయిన్ నాలుగు రాళ్లు వేనకేసుకోవాలి.. అందుకే ఇప్పుడే అందాలతో విందు చేస్తుంది అనసూయ. దాంతో పాటే అద్భుతమైన నటనతో మైమరిపిస్తుంది ఈ బ్యూటీ. చేసేవి కొన్ని సినిమాలే అయినా కూడా గుర్తింపుతో పాటు గుర్తుండిపోయేలా చేస్తుంది.
అలా చేసిన సినిమాలే రంగస్థలం, క్షణం కూడా. ఇప్పుడు కూడా సుకుమార్, బన్నీ సినిమాలో అనసూయ విలన్ పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం పుష్ప నుంచి అనసూయను తప్పించారని ప్రచారం జరుగుతుంది. దీనికి కారణాలు ఇంకా తెలియకపోయినా కూడా అను స్థానంలో నివేదా థామస్ వచ్చి చేరిందని జోరుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. రంగమ్మత్తను తప్పించారంటే మాత్రం కచ్చితంగా కారణం బలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ నిజంగానే బన్నీ సినిమా నుంచి అనసూయ ఔట్ అయితే మాత్రం ఆమె కెరీర్ కు పెద్ద దెబ్బే ఇది. ఎందుకంటే రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఇదే ఊపులో బన్నీ సినిమా కూడా పడితే ఆమె కెరీర్ కు రెక్కలు రావడం ఖాయం. అదే పుష్ప నుంచి తీసేస్తే రెక్కలు తెగడం కూడా ఖాయమే.