నాగబాబు ట్వీట్స్పై పవన్ కళ్యాణ్ క్లారిటీ..

ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు కానీ గాంధీపై వరస ట్వీట్స్ తో వివాదాలకు తెర తీస్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. అదంతా పవన్ కళ్యాణ్ తో పాటు ఆర్ఎస్ఎస్ వెనకుండి చేయిస్తుందంటూ కొందరు విమర్శలు చేస్తున్న వేళ పవన్ కళ్యాణ్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాడు. తనపై జరుగుతున్న ప్రచారానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అందుకే నాగబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. జనసేన పార్టీలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జనసైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. గతంలో కూడా ఈ విషయం చెప్పాం. మరోసారి కూడా చెబుతున్నాం.
నాగబాబు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి. వాటికి, పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు. పార్టీ నిర్ణయాలు, అభిప్రాయాలు అధికార పత్రం, పార్టీ అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం. వాటినే పరిగణనలోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సంతకంతో జనసేన పార్టీ ప్రకటన జారీ చేసింది. అంటే నాగబాబు చేస్తున్న కామెంట్స్ వెనక తాను లేనని చెప్పే ప్రయత్నం చేసాడు పవన్. ప్రస్తుతం ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ నాయకులు.. కార్యకర్తలు అందరూ ప్రజాసేవ గురించి ఆలోచించాలని.. మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పవన్ కళ్యాణ్ కోరాడు. క్రమశిక్షణను అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేసాడు. మరోవైపు నాగబాబు కూడా తను చేస్తున్న ఈ వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగతమే కానీ ఇందులో ఏ పార్టీ ప్రమేయం లేదని స్పష్టం చేసాడు.