త్వరలో గుళ్ళో నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి

దాదాపు నాలుగేళ్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న రొమాంటిక్ జంట నయనతార- విగ్నేష్ శివన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ జంట గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితానికి స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను సవరిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాలు ఈనెల 8 నుంచి తెరుచుకుంటాయని కేంద్రం ఇటీవల నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయంలో వివాహం చేసుకోవాలని ఈ జంట ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది అతిథుల సారథ్యంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పెళ్లి వార్త తెలిసిన నయన్-శివన్ అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.