రానా రవితేజ మల్టీస్టారర్..యువ దర్శకుడికి ఆఫర్

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ సినిమాలన్నీ దాదాపు హిట్ లు కొన్ని సూపర్ డూపర్ హిట్టవుతుండటంతో హిట్ లేని వారు అంతా అదే బాట పడుతున్నారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేస్తుండటంతో ఈ రెండూ కలిసి ఉన్న సినిమా చేయడానికి కూడా హీరోలు సిద్ధమైపోతున్నారు. మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాను రీమేక్ చేయడం కోసం సితార ఎంటర్టైన్మెంట్ కోసం నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అగ్ర హీరో అయిన పృథ్వీరాజ్ నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నాడన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరో పాత్ర కోసం ఓ యంగ్ హీరో అవసరం కావడంతో రానా అనే పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో బాలయ్య క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడీ కథ కోసం రవితేజ, రానాలను ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది.
ఇందులో ఇన్స్పెక్టర్ గా రానా, రవితేజలలో ఎవరు నటిస్తారు? అన్న దాన్ని బట్టి ఆయా పాత్రల్లోనూ చాలా మార్పులు చెయ్యాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక చాలా మార్పులు చేర్పులతో సినిమాని తెరకేక్కించాల్సి ఉంది. మరి ఈ బాధ్యత ఏ దర్శకుడు అందుకుంటారు అనేది ఆసక్తికరంగా మారగా దానికి ఆ మధ్య సుధీర్ వర్మ పేరు వినిపించింది. కానీ తాజాగా దర్శకుడు సాగర్ చంద్ర పేరు వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తోన్న తాజా సమాచారం ప్రకారం యువ దర్శకుడు సాగర్ చంద్రను ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తెలుగు రీమేక్కు ఫైనల్ చేశారని అంటున్నారు. ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టారని అంటున్నారు. సాగర్ కె చంద్ర ఇప్పటి వరకు ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఆయన ఈ సినిమాని ఎలా డీల్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.