ఎన్టీఆర్ సినిమాలో విలన్...క్లారిటీ ఇచ్చిన మనోజ్

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే ఆయన త్రివిక్రమ్తో మరో సినిమాని ఫైనల్ చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాలో నటించే నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. హీరోయిన్స్ గా జాన్వీ కపూర్, పూజా హెగ్డేలను పరిశీలిస్తున్న త్రివిక్రమ్ విలన్ గా మనోజ్ను తీసుకోవాలని భావిస్తున్నాడని అందులో భాగంగా దీనికి సంబంధించి మనోజ్ ని సంప్రదించగా అసలే హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న ఆయన మిత్రుడు సినిమాలో విలన్ గా నటించడానికి సరే అనడంతో అంతా సెట్ అయినట్టేనని ప్రచారం జరిగింది.
ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తోన్న ఈ వార్త గురించి మనోజ్ స్పందించారు. ఆ వార్తల్ని ఖండించిన ఆయన ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశాడు. అయితే విలన్ పాత్రలకు తను వ్యతిరేకం కాదన్న ఆయన, ఇప్పటికిప్పుడు విలన్ పాత్రలో కనిపించే ఉద్దేశం తనకు లేదని అన్నాడు మనోజ్. మనోజ్ ఇప్పుడు అహం బ్రహ్మస్మి అనే ప్రాజెక్టు చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్నాడు.