మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజ

తెలుగులో ఇప్పుడు పూజ హెగ్డే ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో సినిమాలు .. వరుస బ్లాక్ బస్టర్లు పూజ కెరియర్ కు బాగా కలిసి వస్తున్నాయి. తెలుగులో ఆమె స్పీడ్ చూసి తమిళం నుంచి .. హిందీ నుంచి కూడా ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మొన్ననే అల వైకుంఠపురంలో..అనే సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్న ఈ భామ పారితోషకం భారీగా పెంచినట్టు చెబుతున్నారు. అయినా ఆమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా కోసం కూడా పూజ భారీ పారితోషికాన్ని తీసుకుందని అంటున్నారు. సాధారణంగా హీరోయిన్ కంటే హీరోకి పారితోషికం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా కోసం అఖిల్ కంటే పూజ హెగ్డే అందుకున్న పారితోషికం ఎక్కువనే చర్చ సాగుతోంది. ఆ విషయం పక్కన పెడితే డీజే, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేశ్, అల వైకుంఠపురంలో..ఇలా పూజా హెగ్డే నటించిన ప్రతీ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి.
అందుకే దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని ఫాలో అవుతున్న పూజా తన రెమ్యునరేషన్ ను పెంచేసిందని అంటున్నారు. అయితే ఈమెకు బంపర్ ఆఫర్ తగిలినట్టుగా ప్రచారం జరుగుతోంది. అదేనంటే ఈమెకు పవం సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కిందని అంటున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డే నటించబోతుందని ఆ మధ్య సోషల్ మీడియాలో తరుచుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత హరీష్ శంకర్ అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన హరీష్ శంకర్.. హీరోయిన్ గా పూజా హెగ్డే అయితేనే బాగుంటుందని ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.