కరోనా బారినపడ్డ పేదలను రక్షించేందుకు మెగాస్టార్ కీలక నిర్ణయం

పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసుర్తూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సమాయత్తమైంది. కరోనా సోకి రోగ విముక్తులైనవారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుష్షు పోసినట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉచితంగా ఫ్లాస్మా సరఫరా చేస్తోంది. పెదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా విన్నపం. 22 సంవత్సరాలుగా మెగాస్టార్ శ్రీ చిరంజీవిగారు సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచితంగా రక్తనిధులు అందించారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నామని సంస్థ తెలిపింది. ఇక ఈ నిర్ణయంతో కరోనా బారిన పడిన ఎంతోమంది పేదలకు మేలు చేకూరనుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్లాస్మా దానంపై పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.