సినిమాలను థియేటర్స్ ను కాపాడండి..తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

సినిమా హాళ్ళను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్ట్ చేసింది. అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ "మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి" అన్నారు.
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ ``ఆగస్ట్ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా?. కనీసం అక్టోబర్ 30 వరకైనా ఆపుకోండి. సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్ ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను`` అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, చైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్ నామా, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, ప్రముఖ ఎగ్జిబిటర్ సదానంద గౌడ్, సుధా థియేటర్ అనుపమ్ రెడ్డి సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు.