థియేటర్లకు పండగ రోజులు మొదలు.. 100% ఆక్యుపెన్సీకి అనుమతి..

దాదాపు 11 నెలల తర్వాత థియేటర్లో పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది దాంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో సీట్ల 100% కనిపించనుంది “కరోనా” వైరస్ పరిస్థితుల రీత్యా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి గతేడాది అక్టోబర్లో కేంద్రం ఓకే చెప్పింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశంలోని పలు ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకోనున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ, కరోనా తగ్గుముఖం పడుతోన్న తరుణంలో థియేటర్ యాజమాన్యానికి చేయూతనందించే విధంగా నూరుశాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి నూరుశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలు ప్రదర్శించవచ్చని కేంద్రం ప్రకటన చేసింది. “కరోనా” నియంత్రణలో భాగంగా గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని యాజమాన్యాలకు కేంద్రం సూచన చేసింది.
కేంద్రం తాజా మార్గదర్శకాలు..
————————————
1. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, మల్టీప్లెక్స్లు తెరుచుకోవచ్చు.
2. టికెట్లు కొనుగోలు చేసే ప్రాంతంలో, థియేటర్ వెలుపల వెయిటింగ్ రూమ్స్ వద్ద ప్రేక్షకులు తప్పనిసరిగా ఆరు అడుగుల దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలి.
3. థియేటర్ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
4. ప్రవేశం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే ‘థర్మల్ స్ర్కీనింగ్’ ఏర్పాట్లు ఉండాలి.
5. హ్యాండ్ వాష్, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
6. హాలులో ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.