జులై 26న హైదరాబాద్లో నితిన్, షాలిని పెళ్లి..

'భీష్మ' మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ వచ్చిన హీరో నితిన్ వివాహానికి రెడీ అవుతున్నాడు. కరోనా కారణంగా ఆగిన వివాహం జూలై 26న హైదరాబాద్లో రాత్రి 8:30 గంటలకు జరగనుంది. తను మెచ్చిన షాలిని మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు నితిన్. ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే నిఖిల్, దిల్ రాజు లాంటి వాళ్లు కూడా కరోనా నిబంధనలకు లోబడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నితిన్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల వాళ్లతో పాటు కొందరు స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్ 'రంగ్ దే', 'చెక్' అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'అంధాధున్' రీమేక్, కృష్ణచైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలు చేయబోతున్నాడు.