బాలయ్య, బోయపాటి సినిమా కథ ఏంటో తెలుసా..

బాలయ్యకు కొందరు దర్శకులతో భలే సింక్ అవుతుంది. వాళ్ల కాంబినేషన్ ఎప్పుడు వచ్చినా కూడా సంచలనాలు సృష్టిస్తాయి. ఒకప్పుడు కోడి రామకృష్ణ.. ఆ తర్వాత బి గోపాల్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసాడు బాలయ్య. ఓ రకంగా ఆయన కెరీర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన దర్శకులు వాళ్లే. ఆ రేంజ్ లో బాలయ్యతో మాయ చేస్తున్న ఈ తరం దర్శకుడు బోయపాటి శీను. మిగిలిన దర్శకులంతా ఫ్లాపులిస్తున్న సమయంలో సింహా సినిమా చేసి బాలయ్య కెరీర్ కు ఊపిరి ఊదాడు బోయపాటి. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని లెజెండ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మూడోసారి కూడా బాలయ్యతో సినిమాకు సిద్ధమవుతున్నాడు బోయపాటి శీను. వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో బోయపాటికి పది నెలల గ్యాప్ వచ్చింది. మరో సినిమాను మొదలు పెట్టడానికి చాలా టైమ్ తీసుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది.
ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు బాలయ్య సహ నిర్మాతగా ఉన్నాడని తెలుస్తుంది. దీనికోసం రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్లో షేర్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కూడా సింహా, లెజెండ్ సినిమాల్లో మాదిరే ఇప్పుడు కూడా డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. ఇందులో ఒకటి రైతు క్యారెక్టర్ కాగా.. మరొకటి మిలియనీర్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఇందులో రైతు పాత్ర కథకు కీలకమని.. ఇదే పవర్ ఫుల్ రోల్ అంటున్నారు. ఇక మిలియనీర్ క్యారెక్టర్ ప్లే బాయ్ రోల్గా ఉంటుందని.. విజయ్ మాల్యా టైప్ ఆఫ్ కారెక్టర్ ఇది అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్యారెక్టర్ అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందన్నదే చివర్లో ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి బాలయ్య, బోయపాటి సినిమాలో ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ అంతా హైలెట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు అభిమానులు. 2020 సమ్మర్ విడుదలకు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.