కొన్నేళ్లుగా హిట్ మొహం చూడని తెలుగు హీరోలు ఎవరో తెలుసా..

ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరు హీరోల పరిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్కడ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో అఖిల్. ఈ అక్కినేని హీరోకు ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. ఈయన నటించిన మూడు సినిమాలు ‘అఖిల్’, ‘హలో’ ఫ్లాప్. మొన్న ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ సినిమాతో అయినా విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యాడు అఖిల్ అక్కినేని. ఈయనతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు.
2014లో అల్లుడు శీనుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ.. స్పీడున్నోడు, జయ జానకి నాయకా, సాక్ష్యం, కవచం, సీత సినిమాల్లో నటించాడు. అన్నీ ఫ్లాపులే. ఈయన నటించిన రాక్షసుడు కూడా యావరేజ్ అయింది కానీ హిట్ కాదు. ఇక కళ్యాణ్ రామ్కు మూడేళ్లుగా ఒక్క విజయం కూడా లేదు. 2015లో వచ్చిన ‘పటాస్’ తర్వాత అన్నీ ఫ్లాపులే ఈ నందమూరి హీరోకు. గతేడాది వచ్చిన ‘యిజం’.. గతేడాది వచ్చిన ‘నా నువ్వే’, ‘ఎమ్మెల్యే’ సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. ఈ మధ్యే వచ్చిన ‘118’ కూడా పర్లేదనిపించింది కానీ సూపర్ హిట్ కాదు. నితిన్కు కూడా ఫ్లాపుల బెడద తప్పడం లేదు. వరస విజయాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. ఆ తర్వాత మరోసారి తడబడుతున్నాడు ఈ హీరో. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ‘అ ఆ’.. సినిమా తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చాడు నితిన్. ‘లై’, ‘చల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కళ్యాణం’ నితిన్ ఆశలు నిలబెట్టలేకపోయాయి. దాంతో ఇప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాకు కమిటయ్యాడు ఈ హీరో.
రాజ్ తరుణ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ‘కుమారి 21 ఎఫ్’ సినిమా తర్వాత ఇప్పటివరకు మరో హిట్ లేదు ఈ కుర్రాడికి. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో ఇద్దరి లోకం ఒక్కటే సినిమా చేసాడు రాజ్ తరుణ్. మంచు సోదరులు మనోజ్, విష్ణు ఏకంగా సినిమాలు చేయడమే మానేశారు. వాళ్లే సినిమాలు చేసిన ఫ్లాప్ అనే మాట తప్ప ఇంకోటి వినిపించడం లేదు. మనోజ్ అయితే ఈ ఫ్రస్టేషన్లో తాను ఇండస్ట్రీకి దూరమవుతున్నట్లు ట్వీట్ కూడా చేశాడు. యాక్షన్ హీరో గోపీచంద్ను కూడా వరస పరాజయాలు ఇబ్బంది పెడుతున్నాయి. 2014 లో వచ్చిన ‘లౌక్యం’ సినిమా తర్వాత ఈయనకు ఒక్క విజయం కూడా రాలేదు. ఈ మధ్యే తమిళ దర్శకుడు తిరుతో చేసిన చాణక్య కూడా డిజాస్టర్ అయిపోయింది. ఇలా ఈ హీరోలందరికీ ఇప్పటికిప్పుడు ఓ విజయం వస్తే తప్ప ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారన్న సంగతి ప్రేక్షకులకు గుర్తు కూడా ఉండదు. మరి వీళ్ల జాతకాలు 2019లో కూడా మారలేదు.