విశాల్కు అదిరిపోయే షాకిచ్చిన మద్రాస్ హై కోర్టు...

నీతిపై అవినీతి.. అన్యాయంపై న్యాయం.. చెడుపై మంచి.. ఇలా అన్నింటిపై తాము విజయం సాధించామంటూ అప్పట్లో చాలా రచ్చ చేసాడు విశాల్. నడిగర్ సంఘం విజయం తర్వాత విశాల్ రేంజ్ తమిళనాట చాలా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈయనకు షాక్ తగిలింది. మద్రాస్ హై కోర్టు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది విశాల్ యూనిట్ కు. మూడేళ్ల కింది వరకు కూడా శరత్ కుమార్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగాడు. ఈయనకు ఎదురొచ్చే ధైర్యం కూడా ఏ నటుడూ చేయలేదు. రజినీకాంత్, కమల్, విజయ్, అజిత్ లాంటి టాప్ హీరోలు ఈ ఎన్నికల్ని లైట్ తీసుకోవడంతో ప్రతీసారి నడిగర్ సంఘం ఎలక్షన్స్ కూల్ గానే జరిగాయి. కానీ కొన్నేళ్ల కింద శరత్ కుమార్ కు వ్యతిరేకంగా విశాల్ ఎన్నికల బరిలో నిలిచాడు. తమకు ఓటేయాలని నటుల్ని నేను కోరడం లేదనీ.. మీ మనసుకు నచ్చింది చేయండంటూ అరవ నటుల్ని కోరాడు విశాల్. అనుకున్నట్లు అయింది.. సరిగ్గా ఎలక్షన్స్ రోజే విశాల్ పై దాడులు జరగడం.. అంతకుముందు విశాల్ గురించి శరత్ కుమార్ వర్గం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఇవన్నీ విశాల్ వర్గానికే కలిసొచ్చాయి. ఎన్నికల్లో భారీ గెలుపుకు ఇదే బాటలుగా దోహదపడ్డాయి.
విశాల్, శరత్ కుమార్ మధ్య రచ్చ ఈనాటిది కాదు.. మూడేళ్ల కింద ఈ సమస్య మొదలైంది. ఎమ్జీఆర్ కట్టించిన నడిగర్ సంఘం బిల్డింగ్ ను శరత్ కుమార్ పడగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ చేసాడు. ఈ విషయం విశాల్ కు తెలిసి అడ్డుపడ్డాడు. తనతో పాటు నాజర్ లాంటి సీనియర్ నటుల సాయం తీసుకున్నాడు. అప్పట్నుంచీ శరత్ కుమార్ నడిగర్ సంఘానికి చేస్తున్న అక్రమాలపై గళం విప్పుతూనే ఉన్నాడు ఈ తెలుగు హీరో. ఇప్పుడు ఆ వైరం చిలికి చిలికి గాలివానగా మారింది. ఎన్నికల బరిలో శరత్ కుమార్ కు ఆపోజిట్ గా నిలబడి ఆయన్ని ఓడించి.. ఆయన గర్వం దించేవరకు వచ్చింది యవ్వారం.
శరత్ కుమార్ ప్యానల్ నుంచి అధ్యక్ష బరిలో ఉన్న కుర్రహీరో శింబు అడ్రస్ లేకుండా పోయాడు. ఆవేశంలో వచ్చేసి ఆ మధ్య విశాల్ ను కుక్క, నక్క అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు శింబు. అంతేకాదు.. నిన్నగాక మొన్నొచ్చిన బచ్చా విశాల్.. వాడికేం తెలుసు ఇండస్ట్రీ గురించి అంటూ నోటికొచ్చినట్లు రెచ్చిపోయాడు ఈ లిటిల్ సూపర్ స్టార్.
ఇంత జరిగినా విశాల్ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. ఈ ఎదురు చూపులన్నింటికీ ఎలక్షన్ రిజల్టే సమాధానం ఇచ్చింది. ఇవన్నీ ముగిసిన తర్వాత మరోసారి నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరిగాయి. జులై 23, 2019న మరోసారి నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరగగా.. అందులో తప్పులు జరిగాయంటూ కోర్టుకు వెళ్లారు ఆపోజిట్ టీం. దాంతో ఈ ఎన్నికల కౌంటింగ్ ఆపేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఫలితాలు రాలేదు. ఇక రావాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే కోర్టు ఈ ఎన్నికలను రద్దు చేసింది. మరోసారి నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరుపుకోవాలంటూ ఆదేశించింది. దాంతో విశాల్ కు షాక్ తప్పలేదు. నాజర్ తో పాటు చాలా మంది విశాల్ ప్యానల్ లోనే ఉన్నారు. కానీ అందరి కష్టం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైపోయింది. కచ్చితంగా మరోసారి నడిగర్ సంఘం ఎలక్షన్స్ జరపాల్సిన పరిస్థితులు వచ్చాయిప్పుడు. మరిప్పుడు తమిళనాట సినిమా ఎన్నికలు ఏం చేయబోతున్నాయో చూడాలిక.