తెలుగులో ఎవర్ గ్రీన్ సినిమాకి పద్దెనిమిదేళ్ళు

తెలుగు సినిమాల్లో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో క్లాసిక్గా నిలిచిన చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్'. విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 6, 2001న విడుదలై ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టనంత కామెడీ ఉంది. మూవీ పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కుటుంబ విలువలు, స్నేహం, ప్రేమ, పెళ్లి ఇలా అన్ని అంశాల కలగాపులగం లాంటి ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా ఉన్నా చూసే ప్రేక్షకులకు ఎలాంటి విసుగు అనిపించదు. హీరో వెంకటేష్ పాత్ర, దానిని ఎలివేట్ చేసిన విధానం. అన్నీ అన్నీ కొత్తగా ఉంటాయి ఈ సినిమాలో.
ఈ సినిమా కధ విషయానికి వస్తే వెంకీ అని పిలవబడే వెంకటేశ్వర్లు (వెంకటేష్) అనకాపల్లి నుంచి హైదరాబాద్ లో తన తండ్రి శేఖరానికి (చంద్రమోహన్) బాల్యమిత్రుడైన మూర్తి (ప్రకాష్ రాజ్) ఇంటికి వస్తాడు. వచ్చింది మూర్తి కుమార్తె నందిని(ఆర్తి) అగర్వాల్ నిశ్చితార్ధానికే అయినా ఒకలేఖలో ఉద్యోగం కూడా చూడమని రాస్తాడు చంద్రమొహన్. మూర్తి వెంకీకి ఒక ఉద్యోగం చూపిస్తాడు. ఇక గొడవలతో ప్రారంభమై వెంకీ, నందులు స్నేహితులయి క్రమంగా ప్రేమికులవుతారు. అంటే నందు వెంకీకి తన ప్రేమను వ్యక్తపరిచినా తమ కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా , కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెంకీ బయట పడడు.నందు స్నేహితురాలి పెళ్ళికి బెంగళూరు వెళ్ళిన వీరు వాటర్ వరల్డ్ కి వెళతారు. అక్కడ బ్రహ్మానందం వెంకీ, నందూ చేతులు కలిపి ఉండగా ఒక ఫోటో తీస్తాడు.
ఆ ఫోటో నందూ పెళ్ళి సమయంలో పెళ్ళికొడుక్కి చేరి పెళ్ళి పందిరి నుంచి పెళ్లి క్యాన్సిల్ చేసి వెళ్ళిపోబోగా ఎలాగైనా పెళ్ళి జరిపించాలని వెంకీ వాళ్ళను బ్రతిమాలుకుంటాడు. అదే సమయానికి మూర్తి అక్కడికి వచ్చి వెంకీ మంచితనాన్ని చూసి నందును అతనికిచ్చి పెళ్ళి చేయటంతో కథ సుఖాంతమౌతుంది. ఇక కె.విజయ్భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించగా, కోటి సంగీతం అందించారు. సిరివెన్నెల సాహిత్యం, సునీల్, బ్రహ్మానందం కామెడీ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సుధ, బేబి సుదీప, ఎమ్మెస్ నారాయణ తదితరుల నటన ఇలా ప్రతీదీ ఈ సినిమా కోసమే కుదిరినట్టు అనిపిస్తుంది. సెప్టెంబర్ 6, 2001న విడుదలైన 'నువ్వు నాకు నచ్చావ్' నేటితో 18 ఏళ్లు పూర్తిచేసుకుంటోంది.