RRR తర్వాత కూడా మల్టీస్టారర్స్ వైపే రాజమౌళి అడుగులు..

బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి ఏం చేస్తాడనే దానికి ఊహించని సమాధానం ఇచ్చాడు ఈయన. అంతకంటే పెద్ద సినిమా ఇంకేం చేస్తాడులే అనుకుంటున్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేస్తున్నాడు దర్శకధీరుడు. ఒకేసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ ను తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు RRR సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. లాక్డౌన్ అయిపోతే మిగిలిన పార్ట్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శక ధీరుడు. దాంతో ఇప్పుడు నెక్ట్స్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోవాలంటే ఇప్పుడు ఇండియాలో రాజమౌళి తర్వాతే ఎవరైనా..! బాలీవుడ్ దర్శకులు కూడా ఇప్పుడు రాజమౌళితో క్లాసులు చెప్పించుకోడానికి వస్తున్నారు.
అలాంటి దర్శకుడు ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడో.. ఎలాంటి సినిమా చేస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. పైగా విజువల్ ఎఫెక్ట్స్.. కెమెరా ట్రిక్స్.. సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఇప్పుడు రాజమౌళి అవపోసన పట్టాడు. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమాను మహేష్ బాబుతో చేయనున్నట్లు ప్రకటించాడు రాజమౌళి. ఇది జేమ్స్ బాండ్ తరహా కథ అని కొందరు చెబుతున్న మాట. ఇందులో గ్రాఫిక్స్ ఉండవని.. మామూలు కథే అంటున్నారు. అయితే రాజమౌళి గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేస్తాడా అనేది కూడా అనుమానమే. ఇదిలా ఉంటే మహేష్ బాబు తర్వాత మరో భారీ మల్టీస్టారర్ కోసమే రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో ప్రభాస్ తో పాటు మరో సూపర్ స్టార్ నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తండ్రి విజయేంద్రప్రసాద్ లైన్ కూడా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ తో పాటు ఉండే మరో హీరో ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోయినా.. మహేష్ తర్వాత ఈయన చేయబోయే సినిమా మాత్రం మల్టీస్టారర్ అవుతుందని తెలుస్తుంది. ఇకపై కేవలం అలాంటి సినిమాలే చేయాలని చూస్తున్నాడు దర్శకధీరుడు.