ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు మృతి !

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు విజయ బాపినీడు ఈరోజు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బాపినీడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన ఓ సినిమాను నిర్మించారు. చిరంజీవి, శోభన్ బాబులతో హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన ఆయన గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెం 786, మగధీరుడు వంటి బ్లాక్ బస్టర్స్ని తెలుగు పరిశ్రమకి అందించారు. విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి కాగా చిత్ర పరిశ్రమలో ఆయన విజయ బాపినీడుగా సుపరిచితం. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులుగా ఉండి దర్శకునిగా మారాడు. బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. అందుకే ఆయనకు విజయ బాపినీడు అనే పేరు వచ్చింది. విజయ బాపినీడు దర్శకుడిగా డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకు పెళ్ళాం కావాలి (1987), ఖైదీ నెంబరు 786 (1988), దొంగకోళ్ళు (1988), మహారజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్ (1991), బిగ్ బాస్ (1995), కొడుకులు (1998), ఫ్యామిలీ (1994) వంటి చిత్రాలు చేశారు. ఇక నిర్మాతగా ఆయన యవ్వనం కాటేసింది (1976) అనే చిత్రం చేశారు. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో ఆయన జన్మించారు. గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. ఆయన మృతికి టాలీవుడ్ నుండి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.